CSS Drop Down Menu

Friday, April 29, 2016

గుళ్ళలో పెట్టే "వెజ్,నాన్‌వెజ్" ప్రసాదాలు !

భగవంతుడికీ, భక్తులకీ అనుసంధానమైనది ప్రసాదమేనంటారు. రుచి, శుచి, ఆరోగ్యం దాగున్న ప్రసాదం పెట్టే గుళ్లు మన దేశంలో చాలా ఉన్నాయి. ప్రసాదం అంటే అరచేతిలో రాసేదికాదు. కడుపు నిండా ప్రసాదాలు పెట్టే గుళ్లు కూడా ఉన్నాయి. ఆ మాత్రం ప్రసాదాలు పెట్టకపోతే ఆ దేవాలయాలకు భక్తుల రాకపోకలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయనుకోండి అది వేరే విషయం. దేవుళ్లకు పెట్టే ప్రసాదాల్లో ఆయా ప్రదేశాలు, ఆచారాలు బట్టి ఓన్లీ వెజిటేరియన్ ప్రసాదాలే కాకుండా నాన్‌వెజ్ ప్రసాదాలు కూడా ఉంటాయి. నోరూరించే ఆ ప్రసాదాల సమాచారం ఇదే.



ప్రసాదాల్లో ముందుగా చెప్పుకోవాలంటే.. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఒడిషాలోని పూరీ జగన్నాథ్ మహా ప్రసాదం గురించి చెప్పుకోవాలి. ఇక్కడ జగన్నాథుడికి సమర్పించే నైవేద్యంలో 56 రకాల ప్రసాదాలుంటాయి. వీటిని ఆలయ సాంప్రదాయాల ప్రకారం గుడిలోవున్న వంటశాలలోని కుండల్లోనే తయారు చేస్తారు. ముందుగా మహా ప్రసాదాన్ని జగన్నాథుడికి సమర్పించక ముందు ఎటువంటి రుచి గానీ, వాసన గానీ ఉండదు. కానీ దేవుడివి నైవేద్యంగా సమర్పించగానే ప్రసాదానికి ఘమఘుమలతోపాటు అద్భుతమైన రుచి కూడా వస్తుందట. ఇక పూరీ జగన్నాథుడికి నివేదించే  ప్రసాదాల్లో పాయా, పొడిగా ఉండే గజ్జా, పన్నీర్‌తో కలిపి చేసే ఖీరా, కణిక అనే పాయసం, బియ్యం, పప్పు కలిపి చేసే సబ్జీ అబోధా ప్రసాదం భక్తులు అస్సలు మిస్ కానేకారు. జగన్నాథ్  ఆలయంలోనే నాన్‌వెజ్ ప్రసాదం కూడా నైవేద్యంగా పెడతారు. గుడి ఆవరణలోని ప్రత్యేక ఆలయంలోవుండే జగన్నాథుడి సహధర్మపత్ని విమలాదేవికి ప్రతిరోజూ దుర్గాదేవి పూజలు చేసి అమ్మవారికి బలి ఇచ్చిన మేక మాంసాన్ని భక్తులకు ప్రసాదంగా పెడతారు. దీంతోపాటు గుడికొలనులో పట్టిన చేపలను కూడా అమ్మవారికి ప్రసాదంగా సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత. 


వందల ఏళ్ల చరిత్ర గల రాజస్థాన్‌లో సల్సార్ బాలాజీ ఆలయంలో పెట్టే సావమణి ప్రసాదం. ఇక్కడున్న స్వయంభూ హనుమాన్ ఆలయం(దీన్నే శక్తి స్థల్ అని కూడా పిలుస్తారు)లో ఆంజనేయుడి విగ్రహం గుండ్రగా ఉంటుంది. ఆంజనేయుడికి గడ్డాలు, మీసాలు కూడా ఉంటాయి. ఇక్కడకొచ్చి దర్శనం చేసుకంటే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక ఈ మీసాల ఆంజనేయుడికి భక్తులు  50 కేజీలకు తగ్గకుండా నైవేద్యాన్ని సమర్పిస్తారు. నెయ్యి కలిపిన దాల్ భాటి, చుర్మా, బూందీ, దూద్ పేడా లడ్డూ ఉండే ప్రసాదం కోసం భక్తులు ఎగబడతారు.


తిరుపతి లడ్డూ.. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంత క్రేజో తెలిసిందే.. తిరుమల బాలాజీ ఆలయంలో పెట్టే లడ్డూ ప్రసాదం  ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. తిరుమలలో లడ్డూ ప్రసాదంతోపాటు వడ, దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి, మిర్యాల పొంగలి, ఆపమ్, పాయసం, జిలేబీ, మురుకు, దోశె, కేసరి, మల్హోరా ప్రసాదాలు కూడా మంచి రుచిగా ఉంటాయి. తరువాత అమృతసర్‌లోని గోల్డెన్ టెంపుల్. సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే గోల్డెన్ టెంపుల్‌కు రోజూ లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇలా వచ్చిన భక్తులకు గోల్డెన్ టెంపుల్‌  లోని లంగాలర్‌ లో కుల, మత రహితంగా ప్రసాదం వడ్డిస్తారు. లంగార్‌లోని సాంప్రదాయ వంటశాలలో రోజూ రెండు లక్షల చపాతీలు, ఒకటిన్నర టన్నుల పప్పు, వండి వడ్డిస్తారు. భక్తులకు ప్రసాదంగా పంచేందుకు 100  క్వింటాళ్ల గోధుమ పిండి, 25 క్వింటాళ్ల ధాన్యాలు, 10 క్వింటాళ్ల రైస్, 5000 లీటర్ల పాలు, 10 క్వింటాళ్ల చక్కెర, 5 క్వింటాళ్ల  నెయ్యి ఉపయోగిస్తారు. జీవితంలో ఒక్కసారైనా ఈ వెజిటేరియన్ ప్రసాదాన్ని రుచి చూడాల్సిందే. 


అలాగే త్రికూటా పర్వత ప్రాంతం. జమ్మూ సమీపంలోని కత్రాలోవున్న వైష్ణోదేవి ఆలయంలో పిండి రూపంలో ఉండే అమ్మవారు ఎంతో ప్రసిద్ధో.. ఆ దేవాలయంలో  పెట్టే ప్రసాదానికీ అంతే పేరుంది. ఇక్కడ వైష్ణోదేవి అమ్మవారికి రాజ్‌మా, బియ్యంతో ఉడికించిన ప్రసాదం, కడీ చావల్, శెనగలు, పూరీ, ప్రసాదంగా పెడతారు. వీటిలో ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా వండుతారు. వీటితోపాటు ప్రసాదంగా ఇచ్చే పఫ్డ్ రైస్, డ్రైడ్ యాపిల్స్, ఎండుకొబ్బరి, వాల్ నట్స్ ఎంతో ఫేమస్. చివరిగా మధురైకి 20 కిలోమీటర్ల దూరంలో ప్రశాంత వాతావరణంలోవున్న కల్లా జాగర్  కోవిల్. దీన్నే  అలాగర్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. విష్ణుమార్తి కొలువై ఉన్న  ఈ ఆలయంలో ప్రసాదం గొప్ప రుచి గల సాంబార్, దోశె భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.

0 comments:

Post a Comment