CSS Drop Down Menu

Thursday, September 17, 2015

ఉల్లిపాయలు తినకపోతే చస్తారా? అంటూ మంత్రిగారి ఆగ్రహం !

రాజస్థాన్ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ప్రభువాల్ సైనీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్ర మంత్రిగా ఉంటూ ఉల్లిధరలను అదుపుచేయలేని ఈ మంత్రివర్యులు... తన అధికార దర్పంతో ప్రజలను దుర్భాషలాడారు. 
 
తన నియోజకవర్గంలోని రైతులు, ప్రజలతో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ప్రభులాల్ మాట్లాడుతుండగా జనం ఉల్లిపాయల ధరల పెరుగుదలను ప్రశ్నించారు. దీంతో ఆయనకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉల్లిపై మీకు అంత మోజెందుకు.. ఉల్లిపాయలు తినకపోతే చస్తారా అని ప్రశ్నించారు. 
 
మంత్రి తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ధరలు అదుపుచేయలేక తినవద్దని చెప్పడం, తినకపోతే చనిపోతారా అని అడగడం పాలకుల అహంకార మనస్తత్వాన్ని తెలియజేస్తోందని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. దీనిపై రాజస్థాన్‌లో పెద్ద వివాదమే చెలరేగే అవకాశం ఉంది.
 
కాగా, గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఉల్లిధరలు ఆకాశానికి తాకిన విషయంతెల్సిందే. ఈ ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైంది. జనాలు గగ్గోలు పెడుతున్నా పాలకులు మాత్రం నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకున్న విషయం తెల్సిందే.

1 comment:

  1. రమేష్ గారూ, రాజస్ధాన్ మంత్రి గారు అన్నది నాకయితే సబబుగానే తోస్తోంది.
    ఏ వస్తువుకయినా Demand and Supply gap ఉంటే దాన్ని వాడుకుని ధరలు విపరీతంగా పెంచేసి అధిక లాభాలు సంపాదించాలనే ప్రయత్నం వ్యాపారులకి అలవాటే కదా. సరుకు దాచేసి కావాలని gap వచ్చేలా చేసి, కృత్రిమంగా కొరత సృష్టించడం కూడా వాళ్ళకి బాగా చేతనయిన విద్య. వర్షాలు రావట్లేదు, పంట తగ్గీంది లాంటి కారణాలేవో చెబుతుంటారు. వాళ్ళు పరిస్ధితిని అడ్వాంటేజ్ తీసుకోవడాన్ని ప్రభుత్వం నియంత్రించడం భగీరధ యత్నం లాంటిది కదా - అదీ దేశవ్యాప్తంగా చెయ్యాలంటే. ఒక మార్గం - ప్రభుత్వం వారు ముందరే గొడౌవునుల్లో నిలవ చేసుంచి ఇటువంటి సమయంలో పెద్దయెత్తున మార్కెట్ లోకి విడుదల చెయ్యడం ద్వారా పెరిగిన ధరల్ని కొంత అదుపులోకి తీసుకురావచ్చు. కానీ అవినీతి నిర్లక్ష్యంలో కూరుకుపోయిన మన ప్రభుత్వ శాఖలు, అధికారుల సంగతి తెలిసిందే కదా. ప్రైవేట్ వ్యాపారులకి లాభం కలిగించే పనులు చెయ్యడానికి కూడా వెనుకాడరు మన ప్రభుత్వాధికారులు కుమ్మక్కయ్యి (మరో ఉదాహరణ చెప్పాలంటే - ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో ఉన్న విలువైన పరికరాల్ని ఎలా మూలన పడేట్లు చేస్తారో వింటూనే ఉంటాం కదా. తద్వారా ప్రైవేట్ హాస్పిటళ్ళు మరింత లాభాలు చేసుకుంటాయి). విదేశాలనుంచి దిగుమతి చేయ్యడం, రైతుబజార్లో ఆధార్ / గుర్తింపు కార్డ్ చూపిస్తే 20 రూపాయలకి కిలో ఉల్లిపాయలు ప్రభుత్వ కౌంటర్లలో అమ్మడం వగైరా పనులు ఎంతకాలం చెయ్యగలరు? దీనికి పరిష్కారం కొంతవరకు ప్రజల చేతుల్లోనే ఉంది - ఆ వస్తువు వాడకం స్వచ్చందంగా కొంతకాలమయినా తగ్గించుకోవడం / మానెయ్యడం. అప్పుడు ఈ వ్యాపారులు దిగొస్తారు. బియ్యం, గోధుమలు, జొన్నలు లాంటి అత్యవసరమయినవి ఎంతకయినా కొనుక్కోక తప్పదులెండి. ఉల్లిపాయలు అత్యవసరమయినవి కావు కదా. కొంతకాలం ఉల్లిపాయలు తినకపోయినా నష్టమేమీలేదుగా. మనం కొంటున్న కొద్దీ ఆ వ్యాపారులకి లాభాలు ఇబ్బడి ముబ్బడిగా వస్తూనే ఉంటాయి కాబట్టి ధర తగ్గించే ప్రయత్నం వాళ్ళంత వాళ్ళు చెయ్యరు. అందువల్ల ప్రజలే కొంతకాలం ఉల్లిపాయల వాడకం మానేసే మార్గాన్ని అవలంబించవచ్చు. తప్పక ఫలితం ఉంటుంది.

    కారణం / లక్ష్యం వేరేది అయినా 18వ శతాబ్దంలో ఐరోపాలో పంచదార విషయంలో కొంతమంది ప్రజలు ఇలాగే చేసారుట. ఆఫ్రికా దేశస్ధుల్ని వెస్ట్ ఇండీస్ కి (West Indies) బానిసలుగా తరలించి వారి చేత దారుణమయిన చాకిరీ చేయిస్తూ పంచదారకి కావలసిన చెఱుకు పండించడానికి ఉపయోగిస్తుండడం వల్ల ఆ రకంగా తయారయిన పంచదార ("Slave-grown Sugar") వాడడానికి నిరాకరించమని ఉద్యమం జరిగిందిట. మనం వాడుతున్న కొద్దీ వాళ్ళకి లాభాలు వస్తూనే ఉంటాయి, బానిస విధానం కొనసాగుతూనే ఉంటుంది అన్న స్పృహ ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నం చేసారుట. ఫలితంగా ఇంగ్లాండ్ లోనే దాదాపు నాలుగు లక్షల మంది ఆ పంచదారని boycott చేసారట. కొన్ని దుకాణాలు కూడా ఆ పంచదార అమ్మకం ఆపేసాయట. ఈ ఉద్యమం వల్లనే బానిస విధానం రూపుమాసి పోయిందని చెప్పలేం గానీ అవగాహన గణనీయంగా పెరగడానికి తోడ్పడింది. ఈ క్రింది లింక్ లో వివరాలు చదవచ్చు.

    http://abolition.e2bn.org/campaign_17.html


    ఏతావాతా ఉల్లిపాయ ధర అదుపు చెయ్యలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం అయ్యుండచ్చు, కానీ ప్రజల్లో కూడా కొంత స్వీయనియంత్రణ ఉండాలి. నా వ్యక్తిగత అభిప్రాయంలో రాజస్ధాన్ మంత్రి గారి మాటల్ని మాత్రం తప్పు పట్టలేను.

    ReplyDelete