CSS Drop Down Menu

Friday, January 9, 2015

"మత్తుమందిచ్చి నిద్రపోయిన వైద్యుడు" ?


 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడానికి ఓ మహిళకు మత్తుముందిచ్చిన ఓ వైద్యుడు తాపీగా నిద్రపోయాడు. ఇంతకీ ఈ వైద్యుడు ఆపరేషన్‌కు ముందు పీకల వరకు మద్యం సేవించడమేనని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సెలవివ్వడం గమనార్హం.

దీంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మండి జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న తునంగ్ అనే ప్రాంతంలోని ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి 67 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

వీరిలో 30 మందికి మొదటి దశలో ఆపరేషన్ చేయాలని నిర్ణయించి, తొలుత ఆరుగురు మహిళలకు ప్రాథమిక పరీక్షలన్నీ నిర్వహించిన వైద్యుడు ఎనస్తీషియా ఇచ్చాడు. దీంతో వారంతా మత్తులోకి జారుకున్నారు. ఆరో రోగి వద్దకు వచ్చాక ఆపరేషన్ చేయాల్సిన వైద్యుడు నిద్రలోకి జారుకున్నాడు.

దీంతో ఓ విధంగా పెను ప్రమాదం జరగకుండా ఆగింది. అయినప్పటికీ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను అతనిని సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించినట్లు హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కౌల్ సింగ్ ఠాకూర్ అసెంబ్లీకి తెలిపారు.

0 comments:

Post a Comment